చంద్రబాబు సొంత డబ్బాకొట్టుకుంటున్నారు: అంబటి
సాక్షి, హైదరాబాద్ : పోలీసు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తుని ఘటనపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉంది కాబట్టే విచారణ ఆపేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షంపైకి నెడుతున్నారని మండిపడ్డారు. మహిళలపై వేధింపుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని, ఈ వేధింపుల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు.
ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే రాజీ చేశారే తప్ప చర్యలు తీసుకోలేదన్నారు. విజయవాడలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమలు దాడి చేస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులో ఉన్న టీడీపీ నేతలను కాపాడారని, పోలీస్ వ్యవస్థను ఎల్లో డిపార్ట్మెంట్లా తయారు చేశారని మండిపడ్డారు. తమ పార్టీనేత నారయణ రెడ్డి హత్యకేసులో నిందితులపై ఇప్పటి వరకు చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారిపై పోలీస్ యంత్రాగాన్ని ప్రయోగించారని ఆరోపించారు. ఐటీ అధికారులకు రక్షణ కల్పించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని, ఇంకా నయం వారిపై కేసులు పెట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంపై బురద చల్లడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారని, సీఎం అయ్యేందుకు ఎంతటి దారుణానికైనా పాల్పడే మనిషి చంద్రబాబని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ సంస్థ టీడీపీ కోసం పనిచేస్తుందని, ఈ 6 నెలలైనా శాంతి భద్రతలు కాపాడే విధంగా పాలన చేయాలని అంబటి హితవు పలికారు.