పవన్‌ సార్థక నామధేయుడు : అంబటి

Ambati Rambabu Fires On Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సార్థక నామధేయుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌ తన పేరులోని పవనం, కల్యాణం రెండు పదాలకు న్యాయం చేశారని అంబటి వ్యాఖ్యానించారు. పవనం అంటే గాలి అని.. ఇవాళ పవన్‌ గాలి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధానిపై ఏనాడూ ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపని విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓడిపోయిన తరువాత ప్రతిపక్షాలు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

రాజధానిలో రెండు తాత్కాలిక బిల్డింగ్‌ నిర్మించి.. అద్భుతం సృష్టించినట్టు చంద్రబాబు భ్రమలు కల్పించారని ఎద్దేవా చేశారు. ఆయన బినామీలకు నష్టం జరుగుతుందనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే ఏం జరిగిందో అందరికి తెలుసని చెప్పారు. రాజధాని ప్రాంత ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించిన చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. రాజధానిపై కచ్చితమైన వాస్తవాలు చెప్పేందుకు తమ ప్రభుత్వం ప్రయతిస్తోందని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని అంబటి ఖండించారు. 

పిట్టలదొర, తుపాకీరాముడును మరపించేలా..
పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు రహస్య మిత్రుడిగా ఉన్నాడని విమర్శించారు. పవన్‌ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని.. ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గుర్తించకుంటే వచ్చే నష్టమేమి లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, పవన్‌ కలిసి పోటీ చేస్తే ప్రజలు కట్టకట్టి విసిరేసేవారని అన్నారు. ఎందుకు ఎగిరేగిరి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. లాంగ్‌ మార్చ్‌ అని రెండు కిలోమీటర్లు నడవలేని పవన్‌.. గాలి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు పిట్టలదొర, తుపాకీరాముడును మరపించేలా ఉన్నాయని అన్నారు.

గతంలో క్రిస్టియన్‌ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్‌.. ఇప్పుడు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. గతంలో బాప్టిస్టు మతం తీసుకున్నానని చెప్పిన పవన్‌.. తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్‌ తీసుకున్నారా అని ప్రశ్నించారు.  పవన్‌ తాను చేగువేరా వాసరుడని అంటారని, అదే విధంగా హోం మంత్రి అమిత్‌ షా అంతా గొప్పవారు లేరని అంటారని.. ఆయన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. పవన్‌కు స్థిరత్వం లేదని విమర్శించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవి.. బోర్లాపడవద్దని పవన్‌కు సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top