‘జీవితాంతం వెన్నుపోట్లే చంద్రబాబు నైజం’
రైతుల నుంచి వేల ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు
రాజధానిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు..
ఊరూవాడా అన్న క్యాంటీన్లు ఏమయ్యాయి చంద్రబాబు?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి : ‘దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ రైతులను రాజుగా చూశారు.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వ్యవసాయాన్ని దండగ అంటున్నారు. గత ఎన్నికల్లో 600 పైచిలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తాను మారాను అని చంద్రబాబు చెబుతూనే ఉంటారని, ఆయన ఎన్నటికీ మారని మనిషి’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జీవితం చివరి వరకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉండే వ్యక్తి చంద్రబాబు అని, మాయమాటలు చెప్పడం ఆయనకు అలవాటేనని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. ఉండవల్లిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న ఆర్కే నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.
ప్రపంచ స్థాయి రాజధాని అంటూ రైతుల నుంచి 33 వేల ఎకరాలకు పైచిలుకు తీసుకుంటే, అందులో 15 వేల ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు. రాష్ట్ర రైతులను చంద్రబాబు మోసం చేశాడు. కూలీలను సైతం ఇక్కడి నుంచి మాయం చేస్తున్నారు. అందుకే చంద్రబాబును తరికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మున్సిపాలిటీ పన్నులు కడుతున్నా పేదలకు మాత్రం ఇళ్లు లేవు. నువ్వు మాత్రం ఆక్రమించుకున్న ఇంట్లో ఉంటున్నావు. దీనిపై హైకోర్టు రెండు సార్లు చెప్పినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఊరూవాడా అన్న క్యాంటీన్లు పెడతానన్నావు. కానీ అమలు చేయలేదు. మా రాజన్న క్యాంటీన్ దిగ్విజయంగా నడుస్తోంది. పేదవాడికి అన్నం పెట్టాలనే ఇంగితం కూడా లేదంటూ’ సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు.
ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం కొనసాగిస్తున్న వైఎస్ జగన్ వెంట నడవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని మండలాల్లో తాగునీటికి అల్లాడుతున్నారు. రాజధానిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చెప్పే చంద్రబాబు.. ఇలా ఏ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మనసుంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గంలో నడవాలని చంద్రబాబుకు సూచించారు.
సంబంధిత వార్తలు