రైతులు, యువత మా వెంటే..
లక్నో : సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో నేతలు సుడిగాలి పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. యూపీలోని పూర్వాంచల్లో ఆజంగఢ్, గోరఖ్పూర్, వారణాసి వంటి పలు కీలక నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ జరగనుండటంతో ఆయా నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆజంగఢ్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బరిలో నిలవగా బీజేపీ తరపున ప్రముఖ భోజ్పురి నటుడు దినేష్ లాల్ యాదవ్ తలపడుతున్నారు.
పూర్వాంచల్ ప్రాంతంలో గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు తమ పార్టీకి కలిసివస్తాయని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. యువత, రైతులు పెద్దసంఖ్యలో ఎస్పీ వెంట నడుస్తున్నారని చెప్పకొచ్చారు. తమ ప్రభుత్వం ముందుకు తెచ్చిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టును గత రెండేళ్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశ యువత, రైతాంగం తమను మోసగించిన మోదీ సర్కార్ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.