141వ రోజు పాదయాత్ర డైరీ

141st day padayatra diary - Sakshi

21–04–2018, శనివారం
నూజివీడు, కృష్ణా జిల్లా

అమ్మ స్థానాన్ని దిగజార్చేలా రాజకీయాలు సాగడం అత్యంత దారుణం
కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో ఎంత బలంగా ముద్రవేసుకుపోతాయో.. ఈ రోజు ఉదయం ఎదురైన ఓ అనుభవం పట్టిచూపింది. చేతిలో పలక పట్టుకుని ఓ ఏడేళ్ల బాలుడు తన తండ్రితో పాటు నన్ను కలిశాడు. ఆ పలక మీద వైఎస్సార్‌ అనే అక్షరాలు కనిపించాయి. ఆసక్తి కలిగి ఏంటని ఆ తండ్రిని ఆరా తీశా.. ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఐదేళ్ల కిందట ఆ చిన్నారి నషీర్‌తో అక్షరాభ్యాసం చేయిస్తూ నేను దిద్దించిన అక్షరాలట. నేను ఆ రోజు అఆలు దిద్దించబోతే.. వద్దని వారించి వైఎస్సార్‌ అని దిద్దించాలని కోరారు. పలకపై ఆ అక్షరాలు చెరిగిపోకుండా భద్రంగా దాచి ఐదేళ్ల తర్వాత ఇప్పుడొచ్చి చూపించి వారు మురిసిపోతుంటే.. చాలా ఆనందంగా అనిపించింది. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ చిన్నారిని దీవించాను. పలకపై వైఎస్సార్‌ అనే అక్షరాలను.. హృదయ ఫలకంపై నాన్నగారి మీద ఉన్న ప్రేమను పదిలంగా దాచుకున్న విస్సన్నపేట తండ్రీకొడుకులకు శుభాకాంక్షలు చెప్పి ముందుకు నడిచాను. 

ఆగిరిపల్లి పాడి రైతుల బాధ.. సహకార పాల డెయిరీలపై చంద్రబాబు దాష్టీకానికి పరాకాష్టగా కనిపించింది. ప్రయివేటు డెయిరీల గుత్తాధిపత్యం నుంచి పాడి రైతులను రక్షించేందుకు నాన్నగారు 2008లో కృష్ణవేణి సహకార డెయిరీని ఏర్పాటు చేశారు. ‘డెయిరీ పెట్టి రాజన్న మా నెత్తిన పాలు పోస్తే.. ఇప్పుడు చంద్రబాబుగారొచ్చి సహకార డెయిరీని మూసేయించి మా నెత్తిన నిప్పులు పోశాడు. పాడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోగా.. బకాయిలే దాదాపు రూ.4 కోట్ల వరకూ ఇవ్వాల్సి ఉంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే సహకార డెయిరీలన్నీ మూతపడటం.. అదే సమయంలో ఆయన సొంత డెయిరీ హెరిటేజ్‌ లాభాల బాటలో దూసుకెళ్లడం.. కుట్రకాక మరేంటి? తన స్వార్థం కోసం లక్షలాది పాడి రైతుల పుట్టి ముంచడం ధర్మమేనా? 

నాన్నగారి మహదాశయానికి నిదర్శనమైన ట్రిపుట్‌ ఐటీ ముందు నుంచి నడుస్తుంటే ఆయన స్మృతులు మదిలో మెదిలాయి. గ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్‌ విద్యను అందించాలన్న నాన్నగారి మహత్తర స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్న ఆ నూజివీడు ట్రిపుల్‌ ఐటీ గేట్లన్నింటికీ తాళాలు వేసి ఉన్నాయి. పక్కనే ట్రిపుల్‌ ఐటీ శ్రీకాకుళం అన్న బోర్డు కూడా కనిపించింది. ఆశ్చర్యపోయాను.. నూజివీడులో శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ఏంటా అని.

ఇంతలో అక్కడ పనిచేసే బోధనా సిబ్బంది కొంతమంది కలిశారు. ‘సార్‌.. విద్యార్థులుగానీ, సిబ్బందిగానీ, మా కుటుంబ సభ్యులుగానీ మిమ్మల్ని కలవరాదని, బాధలు చెప్పుకోరాదని ఆంక్షలు విధించారు. బెదిరించారు. గేట్లు మూసేయించారు. అందుకే సెలవు పెట్టిమరీ మిమ్మల్ని కలుస్తున్నాం’ అని వారు చెబుతుంటే.. గేట్లకైతే తాళాలు వేయగలరుగానీ.. హృదయంలోని ప్రేమకు వేయలేరు కదా.. అనిపించింది. నిధుల కోత, తీవ్రమైన సిబ్బంది కొరత, చాలీచాలని వసతులు, నిర్వహణ లోపం, చంద్రబాబు సర్కారు దారుణ నిరాదరణ.. వెరసి ఆ విద్యాలయం సమస్యల నిలయమైంది.

నేను కూడా ట్రిపుల్‌ ఐటీ ఇచ్చానని గొప్పలకు పోయి.. ఆర్భాటంగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలను ప్రకటించారు బాబుగారు. తర్వాత నిధులివ్వకుండా, కనీసం స్థలం కూడా కేటాయించకుండా, శ్రీకాకుళంలో ఏర్పాటు చేయకుండా.. ఆ విద్యార్థులను సైతం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో పెట్టిన మోసకారితనం చంద్రబాబుది. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీని సైతం ఇడుపులపాయలో పెట్టారట. ఎంత హాస్యాస్పదం? గ్రామీణ పేద విద్యార్థులను సైతం మోసం చేసి.. వారి భవిష్యత్తుతో ఆడుకునే అధికారం ఆయనకు ఎవరిచ్చారు?

ఢిల్లీకి రాజు అయినా అమ్మకు కొడుకే.. అన్నారు మన పెద్దలు. సృష్టిలో జీవులన్నిటికీ అమ్మే తొలి గురువు.. దైవం. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మ స్థానం అంతటి ఉన్నతమైనది.. పవిత్రమైనది. కొద్ది రోజులుగా అమ్మ స్థానాన్ని దిగజార్చేలా.. అవమానపరిచేలా రాజకీయాలు సాగడం అత్యంత దారుణం.. మహాపాపం. అలాంటి దిగజారుడు రాజకీయాలు ఏమాత్రం సమర్థనీయం కాదు. గత 141 రోజులుగా చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ఎందరో అమ్మలు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. వారి ఆప్యాయత, అనురాగాలు అనిర్వచనీయం. అందుకే మాది ఎప్పుడూ ఒకటే సిద్ధాంతం.. ‘అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మకు నా వందనం’

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. సహకార డెయిరీలున్నప్పుడు పాడి రైతులకు మంచి ధర లభించిన మాట వాస్తవం కాదా? అవి మూతపడ్డాక గిట్టుబాటు ధర లేకపోవడం నిజం కాదా? ఇది తెలిసి కూడా సహకార డెయిరీలను మూసేస్తున్నారంటే.. పాడి రైతుల పొట్టకొట్టి.. మీ సొంత డెయిరీ హెరిటేజ్‌ను వృద్ధి చేసుకోడానికే కాదంటారా?
- వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top