బహుముఖ వికాసం వైపుగా..
పాకిస్థాన్ సమస్యలో భాగమే తప్ప, పరిష్కారంలో భాగం కాదనడానికి తగినన్ని ఆధారాలున్నాయనే మన వైఖరితో ఏకీభవించేలా ఒబామాను మోదీ ఒప్పించారు. ఇక పాక్లోని ఉగ్రవాద సంస్థలను వేటాడటంలో అమెరికా, భారత్లు భాగస్వాములు కాగలుగుతాయి. ఈ ఒప్పందం ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ ప్రకటనను పాక్ ప్రభుత్వం శ్రద్ధగానూ, ఆందోళనతోనూ ఆలకించి ఉండాలి.
దేశం అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. దుర్బలత్వం అంతర్గతమైనది కాగా ముప్పు బహిర్గతమైనది. దేశం ముక్కోణపు ఉచ్చులో చిక్కుకుని ఉంది. ఉద్యోగావకాశాలను క్షీణింపజేసి, ఆశ సన్నగిల్లిపోయేలా చేసిన ఆర్థిక సంక్షోభం దానికి ఒక కోణమైతే. పెచ్చు పెరిగిపోయిన అవినీతి సృష్టించిన నైతికపరమైన అగమ్యగోచర స్థితి మరో కోణం. నిరాశామయమైన భవిష్యత్తులోకి తరచి తరచి చూస్తున్న యువ జనాభా మిగిలిన మూడో కోణం. సార్వత్రిక ఎన్నికల్లో ఏ దురదృష్టవశాత్తునో మనం ఎవరికీ మెజారిటీ లభించని తీర్పును వెలువరించి ఉంటే... ఊహింపశక్యం కాని పర్యవసానాలకు దారితీయగల గందరగోళ పరిస్థితులు నెలకొంటూ ఉండటాన్ని మనం వీక్షిస్తుండేవాళ్లం. మోదీ చేపట్టిన తొలి చర్యలతో ఆర్థిక వ్యవస్థకు త గిలిన లోతైన గాయాలను మాన్పడం ప్రారంభమైంది. యువతలోని ఆకాంక్షల సూచికను ఊర్ధ్వ దిశకు పునరుద్ధరించాయి.
బహిర్గత ముప్పు భూకంప కేంద్రం పరిధి దృశ్యమాన దిగంతాలను దాటి విస్తరించినది. పాకిస్థాన్ను కేంద్రంగా చేసుకున్న లష్కరే తోయిబా, తాలిబన్వంటి మిలీషియాలు చాలా కాలం క్రి తమే భారత్ను తమ ప్రధాన లక్ష్యంగా ప్రకటించాయి. ఫలప్రదమైన మోదీ అమెరికా పర్యటన ఈ ఉన్మాదపు ముప్పును నేరుగా ఎదుర్కోవడంలో మైలురాయి లాంటి మైత్రీ బంధాన్ని ఏర్పరిచింది.
ఉగ్రవాద, నేరగ్రస్థ వ్యవస్థలను, యంత్రాంగాలను నిర్మాణాలను ‘‘ఉమ్మడిగా, కలిసికట్టుగా చేసే కృషితో’’ నిర్మూలించాలనే అంశంపై అంగీకారాన్ని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామాలు తమ అర్థవంతమైన ప్రకటనలో వెల్లడించారు. వారు పేర్కొన్న ఆ ముఠాలలో లష్కరే, జైషే మొహ్మద్, అల్ కాయిదా, డి కంపెనీ (దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని మాఫియా), హక్కానీ నెట్వర్క్లతో పాటూ ‘‘ఉగ్రవాద ప్రయాణీకులు’’ అనే చక్కని పదబంధంతో సూచించేవారు కూడా ఉన్నారు (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పతాకం కింద యుద్ధం సాగించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వ్యక్తులు లేదా బృందాలను అందుకు ప్రముఖ ఉదాహరణగా చెప్పుకోవచ్చు).
ఇది అమెరికా విధానంలో వచ్చిన పెద్ద మార్పును సూచిస్తుంది. ఈ ఉగ్రవాదులకు స్థావరాలు ఎక్కడున్నాయి? పాక్ గడ్డ మీద, పాక్ భద్రతా బలగాల రక్షణ ఛత్ర ఛాయల్లో. ఈ సంస్థల్లో ప్రతి దానిపైనా అమెరికా ఎన్నడో ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసింది. ఈ యుద్ధ ప్రాంతంలోకి భారత్ను కూడా చేర్చడం పట్ల పాక్కు ఉన్న ఆందోళనలను అది ఎప్పుడూ పరిగణలోకి తీసుకుంటుండేది. పాక్ తనకు లభించిన ఈ వెసులుబాటును పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తుందనేది స్పష్టమే. అప్ఘానిస్థాన్ను అది తన ప్రత్యేక వ్యూహాత్మక ప్రాంతంగా కూడా పరిగణిస్తుంది. పాకిస్థాన్ సమస్యలో భాగమే తప్ప, పరిష్కారంలో భాగం కాదనడానికి తగినన్ని ఆధారాలున్నాయనే విషయంలో మన వైఖరి సుస్పష్టం. భారత్ వైఖరితో ఏకీభవించేలా ఒబామాను మోదీ ఒప్పించారనేది తెలుస్తూనే ఉంది.
ఈ ప్రకటన తదుపరి పాక్లోని ఉగ్రవాద సంస్థలను వేటాడటంలో అమెరికా, భారత్లు భాగస్వాములు కాగలుగుతాయి. ఈ ఒప్పందం ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ ప్రకటనను పాక్ ప్రభుత్వం శ్రద్ధగానూ, బహుశా ఆందోళనతోనూ ఆలకించి ఉండాలి. ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో మిత్రునిగా నటిస్తూనే రహస్యంగా, ఉగ్ర సంస్థలను ప్రోత్సహించడమనే ద్విపాత్రాభిన యాన్ని అది చాలా కాలంగానే రక్తి కట్టిస్తోంది. ఆ ఆటలు ఇక ఎంతమాత్రమూ సాగవనే అనుకోవాలి.
వాస్తవానికి పాక్ తన ఈ ద్విపాత్రాభినయాన్ని సమర్థవంతంగా దాచిపెట్టడానికి విశేష కృషినే చేసింది. ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ను లష్కరే అధినేత హపీజ్ సయీద్ గురించి అడిగినప్పుడు... హఫీజ్ తమ దేశ పౌరుడు కాబట్టి పాక్లో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లే హక్కు ఆయనకుంటుందని అలవోకగా చెప్పడాన్ని గమనించండి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉగ్రవాదిగానూ, తలపై వెల కలిగి ఉన్నవాడిగానూ ఆతగాడు ఇప్పుడు నిర్బంధంలో ఉండాల్సింది, బోనులో నిలిచి విచారణను ఎదుర్కొంటూ ఉండా ల్సింది. అతగాడికి వ్యతిరేకంగా నేడు సాగుతున్న న్యాయ తతంగం అంతా బూటకపు డ్రామా.
అఫ్ఘాన్ ప్రాంతంలో సైతం పరివర్తనా కాలంలో, అమెరికా నేతృత్వంలోని నాటో బలగాల ఉపసంహరణ తర్వాత భారత్ పోషించాల్సిన ముఖ్య పాత్ర ఉన్నదనే సంకేతాలను అమెరికా వెలుపరించింది. పాక్ ప్రభుత్వం, సైన్యం మద్దతును అందిస్తూ, పరిరక్షిస్తున్న హక్కానీ నెట్వర్క్ గురించి ప్రస్తావించడం కూడా దీన్ని రూఢి చేస్తోంది. ఈ పర్యటనతో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక నూతన స్థాయికి చేరింది. మన దేశం నేడు అణు సరఫరా గ్రూపులో ఒకటి కానుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తదుపరి కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడే ఉండిపోయారు. గూఢచార సమా చారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఈ విషయంలో విస్తరి స్తున్న మైత్రికి సంబంధించి తదుపరి చేపట్టాల్సిన చర్యలకు రూపు రేఖలను తయారు చేయడం వంటి అంశాలకు సంబంధించి సన్నాహాలను చేస్తున్నారు.
మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ఇదే ప్రధానాంశం. దీనికి తోడు అమెరికా-భారత్ సంబం ధాలు బహు ముఖంగా వికసించనున్నాయి. ద్వైపాక్షికమైన ఈ సామరస్యం నుండి అలహాబాద్, అజ్మీర్, విశాఖపట్నాలలో సరికొత్త ప్రపంచ స్థాయి నగరాలు ఉద్భవించడాన్ని మనం కళ్లారా చూడనున్నాం. వచ్చే పార్లమెంటు సమావేశాల కాలండర్లోగానే పరిపూర్తి చేస్తామని వాగ్దానం చేసినట్టుగానే మోదీ పన్నుల చట్టాలపై స్పష్టతను తెచ్చారు. రెడ్ టేప్కు క త్తెర వేశారు. ప్రత్యేకించి ఈ కారణంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని పునరుద్ధరించడానికి అమెరికా వ్యాపార వేత్తలు ప్రోత్సాహం అందిస్తారు. మోదీ హృదయానికి అత్యంత సన్నిహితమైన నీరు, పారిశుద్ధ్యం అంశాలపై ఒక ప్రాజెక్టు కోసం రెండు దేశాలు సంతకాలు చేశాయి.
ఊహించిన విధంగానే మోదీ పర్యటనలోని వెలుగుల జిలుగులపైనే మీడియా ఎక్కువగా శ్రద్ధను చూపింది. ప్రత్యేకించి మాడిసన్ స్క్వేర్ గార్డెన్లోని మోదీ ప్రసంగం, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ పార్క్లో ఒబామాతో కలిసి ఆయన నడవడం వంటి హై ఓల్టేజీ కార్యక్రమాలపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అయితే ఇరువురు నేతలు తమ ఆలోచనలు కలిసే వరకు ఉత్సాహాన్ని బయట పెట్టలేదు. చప్పగా చల్లారిన ద్వైపాక్షిక సంబంధాలకు మోదీ, ఒబామాలు ముందుగా నూతనోత్తేజాన్ని కల్పిం చాలి, కష్టభరితమైన అంతర్జాతీయ వాతావరణంలో ముందుకు సాగాలి. వారు ఎంచుకున్నది సుపరిచిత మైన దాటవేత అవకాశాన్ని కాదు. స్పష్టతనే వారు ఎంచుకున్నారు.
ఎం.జె. అక్బర్