మోడీకి వీసా ఇవ్వాలని అమెరికాను కోరతా: రాజ్నాథ్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించేందుకు వీలుగా ఆయన వీసాను పునరుద్ధరించాలని అమెరికా పాలకులను కోరనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ తెలిపారు. గోద్రా ఘటన అనంతరం 2002లో గుజరాత్లో హింస చెలరేగడంతో అప్పుడు సీఎంగా మోడీకి వీసా నిరాకరిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్, వాషింగ్టన్లలో ఐదురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్నాథ్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికలలో అభివృద్ధి మంత్రమే తమ ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంటుందని తెలిపారు. రామజన్మభూమి వివాదం కంటే అభివృద్ధి నినాదంతోనే ఈసారి ఎన్నికల్లో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. రామజన్మభూమి ఎప్పుడూ ఎన్నికల నినాదం కాదని, జాతీయ ప్రాధాన్యత గల అంశం మాత్రమేనని చెప్పారు. నరేంద్ర మోడీకి ఉన్న జనాకర్షణ, ప్రతిష్టను పరిగణనలోకి తీసుకొనే ఎన్నికల ప్రచార సారథ్యం అప్పగించామన్నారు.