23 నుంచి ఏఐటీయూసీ మహాసభలు
శ్రీరాంపూర్(మంచిర్యాల): ఈ నెల 23, 24 తేదీల్లో ఏఐటీయూసీ 15వ సెంట్రల్ మహాసభలను భూపాలపల్లిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆర్కే 7 గనిపై వాల్ పోస్టర్ విడుదల చేశారు. యూనియన్ బ్రాంచీ సెక్రెటరీ కొట్టె కిషన్రావు మాట్లాడుతూ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.నర్సింహన్, రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.గట్టయ్య, వీ.సీతారామయ్య హాజరవుతున్నట్లు వెల్లడించారు.
మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించి వాటి సాధన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. కారుణ్య నియామకాలపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కోరారు. రెండేళ్ల సర్వీసు నిబంధన ఎత్తివేసి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పైడి రవీందర్రెడ్డి, ఫిట్ సెక్రెటరీ సారయ్య, సహాయ కార్యదర్శి బీర రవీందర్, ప్రచార కార్యదర్శులు పెద్దన్న, మైసయ్య, బరిగెల ప్రతాప్, శ్రీనివాస్, రవీందర్, బ్రహ్మయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.