'ఆ మంత్రి నన్ను రేప్ చేశారు'
కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ తనపై మూడేళ్ల క్రితం అత్యాచారం చేశారంటూ జైపూర్కు చెందిన ఓ వివాహిత ఆరోపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనకు రెండు నిమిషాల సమయం ఇచ్చి, తనను కాపాడాలని కోరుతోంది. ఈ విషయమై ఆమె మీడియాను ఆశ్రయించింది. కేసు ఉపసంహరించుకుంటే తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ పెడుతున్నారని, కానీ.. తనకు న్యాయం జరగాలని ఆమె అడుగుతోంది. ఆరోపణల నేపథ్యంలో మేఘ్వాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తుండగా, సొంత పార్టీ నుంచి మాత్రం మంత్రికి మద్దతు బాగానే లభిస్తోంది. కేవలం కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఎవరికీ రక్షణ ఉండదని, కానీ ఎవరో ఒకరిని చూసుకుని వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం కూడా సరికాదని, ఆ ఆరోపణలు ఇంతవరకు నిరూపితం కాలేదని పార్టీ సీనియర్ నాయకుడు మీనాక్షి లేఖి అన్నారు.
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలోని ఓ మంత్రిపై వచ్చిన మొట్టమొదటి ఆరోపణ ఇదే. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి అయిన మేఘ్వాల్ (43) రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక సభ్యుడు. 2011లో మేఘ్వాల్ సహా మరికొందరు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. రాజకీయాల్లోకి రావాలని భావించిన తన భర్త బలవంతంగా వారివద్దకు తనను పంపాడని ఆమె చెబుతోంది. ఈ కేసులో నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది.