వయోలినిస్ట్ బాలభాస్కర్ ఇకలేరు
తిరువనంతపురం: ప్రముఖ వయోలినిస్ట్, గాయకుడు, మ్యుజీషియన్ బాలభాస్కర్ (40) కన్నుమూశారు. గత నెల 25న రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్న ఆయన సన్నిహితులు, కుటుంబసభ్యులతోపాటు, ఇతర సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
త్రిస్సూర్లో దైవదర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా, తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలభాస్కర్ కుమార్తె తేజస్వి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆయన భార్య లక్ష్మి శాంతకుమారి (38), డ్రైవర్ అర్జున్ ఇంకా చికిత్స పొందుతున్నారు. మరోవైపు డ్రైవర్ నిద్రమత్తే కారణమని భావించిన కేరళ పోలీసులు ఈ మేరకు ఫేస్బుక్లో ఒక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. డ్రైవింగ్ సమయంలో నిద్ర వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రచారాన్ని చేపట్టారు.
కాగా సంగీత దర్శకుడిగా కరియర్ను ప్రారంభించిన బాలభాస్కర్ స్టేజీ షోలతో,వయోలినిస్ట్గా మరింత పాపులర్ అయ్యారు. 12 ఏళ్ళ వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించిన మలయాళ చిత్రపరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా ఖ్యాతి గడించారు. ‘మాంగల్య పల్ల’కు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారిన బాలభాస్కర్.. ఆ తరువాత ‘మోక్షం’, ‘కన్నదిక్కదవతు’ అనే చిత్రాలకు సంగీతం అందించారు. వయోలినిస్ట్గా ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు.