జైట్లీ మరణం: యూఎస్‌ ఎంబసీ సంతాపం

US Embassy Remembers Arun Jaitley Services - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్‌ జైట్లీ మరణం పట్ల భారత్‌లోని అమెరికా ఎంబసీ సంతాపం వ్యక్తం చేసింది. జీఎస్టీ ప్రవేశపెట్టడం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ను మెరుగుపరిచే దిశగా అదే విధంగా అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం‌ వంటి చిరస్మరణీయ సేవలు అందించారని జైట్లీని కొనియాడింది. ఈ మేరకు..‘ అమెరికా- భారత్‌ల మధ్య ఆర్థిక విషయాల్లో సత్సంబంధాలకై అరుణ్‌ జైట్లీ ఎనలేని కృషి చేశారు. ఆయన మరణం పట్ల చింతిస్తున్నాం. జైట్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అదే విధంగా భారత దేశ ప్రజలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ట్వీట్‌ చేసింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న అరుణ్‌ జైట్లీ శనివారం కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర నాయకులంతా జైట్లీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top