ఇంకా కోట్లలో పాత నోట్లు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన ఇన్నాళ్ల తర్వాత కూడా అవి ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. పాత నోట్లను మార్చుకోడానికి కొంత గడువు ఇచ్చి, మార్చి నెలాఖరులోపు వాటిని బ్యాంకులలో మార్చుకోకపోతే అవి ఎందుకూ పనికిరావని చెప్పినా ఇప్పటికీ కొంతమంది పాతనోట్లతో పట్టుబడుతున్నారు. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతంలో కోటి రూపాయల పాత నోట్లతో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మాండ్వి మెయిన్ రోడ్డు వద్ద స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాలలో వాళ్లు పట్టుబడ్డారు.
ఆ ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్పై వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా వాళ్ల వద్ద కోటి రూపాయల పాతనోట్లు దొరికాయి. మోటార్ సైకిల్ మీద ముగ్గురు కాస్త అనుమానాస్పదంగా కనిపించారని, తీరా అడిగితే తమవద్ద తగిన పత్రాలున్నాయంటూ తొలుత అబద్ధాలు చెప్పారని, వారిని అదుపులోకి తీసుకుని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించామని ఎస్ఓజీ ఇన్స్పెక్టర్ కేకే జాలా చెప్పారు. దీపక్ నందా, త్రిలోక్ దవే, సులేమాన్ భట్ అనే ముగ్గురు నగదుతో పట్టుబడ్డారు.