జమ్మూకశ్మీర్లో పోలీసు బస్సుపై ఉగ్రదాడి
ఓ పోలీస్ మృతి, ముగ్గురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై సాయుధ పోలీసు బలగాలతో వెళుతున్న బస్సుపై పాంథా చౌక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు పోలీసులను వెంటనే బదామీబాగ్ కంటోన్మెంట్ ఏరియాలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించగా, హెడ్కానిస్టేబుల్ కిషన్ లాల్ చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు బస్సులో బెమీనా నుంచి జెవాన్ ప్రాంతానికి వెళుతుండగా ఈ దాడి జరిగినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ ముగ్గురు పోలీసుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.
పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి: పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం పాక్ స్నైపర్లు జరిపిన కాల్పుల్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట పూంచ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ఓ జవాను దుర్మరణం చెందారు.