స్కైలాబ్ నుంచి కరోనా దాకా..
నాలుగు దశాబ్దాల్లో గడగడలాడించిన రెండు ఉపద్రవాలు..
స్కైలాబ్తో అప్పట్లో వణికిపోయిన ప్రజలు..
అన్నీ అమ్ముకుని పండుగ చేసుకున్న జనం..
ఇప్పుడేమో కరోనా మహమ్మారితో ప్రాణాలు అరచేతిలో..
గత మూడు వారాలుగా భయాందోళనలో ప్రపంచం..
సాక్షి, హైదరాబాద్: స్కైలాబ్.. కరోనా.. గత నాలుగు దశాబ్దాల్లో కల్లోలం సృష్టించిన రెండు పెద్ద ఉపద్రవాలు.. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జనాలను వణికించిన పేర్లు ఇవి.. ఇప్పుడు కరోనా దాదాపు మూడు వారాలుగా ప్రతి ఒక్కరిని ముప్పు తిప్పలు పెడుతుంటే.. అప్పట్లో స్కైలాబ్ దాదాపు మూడు వారాల పాటు అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. జనాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఉపద్రవాల జాబితా రూపొందిస్తే మొదటి, రెండో స్థానాల్లో ఇవే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.
రేడియో వార్తలకోసం..
ఆప్పట్లో ఊరూరికి వార్తా పత్రికలు వచ్చే రోజులు కాదు కాబట్టి.. రేడియో ఉన్న వారిళ్లకు క్యూ కట్టేవారు.. సరిగ్గా వార్తల వేళ ఊరూరు కదిలివచ్చేది. అందులో స్కైలాబ్ గురించి చెబుతారని అందరూ ఎదురుచూసేవారు. చివరకు జూన్లో శాస్త్రవేత్తలు దాన్ని విజయవంతంగా సముద్రంలో కూల్చేశారు. కొన్ని శకలాలు మాత్రం భూమిపై పడ్డాయి. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై కావడం విశేషం. భారత్కు ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న జనాలంగా ఊపిరి పీల్చుకుని ఆపేసిన పనులు మళ్లీ మొదలు పెట్టారు.
ఇప్పుడు కరోనా భీభత్సం..
గత మూడు వారాలుగా ప్రజలందరిలో ఒకటే భయం.. కరోనా వైరస్ విరుచుకుపడుతోందనే మాటే అందరి నోళ్లలో వినిపిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని విపత్తులు సంభవించినా.. అవి ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అన్ని ప్రాంతాల బారినపడ్డ దాఖలాలు లేవు. అప్పట్లో స్కైలాబ్ అన్ని ప్రాంతాలను వణికించగా, ఆ తర్వాత అదే తరహాలో తీవ్ర భయాందోళనలు అన్ని చోట్లా కన్పించడం మళ్లీ ఇప్పుడే.అప్పట్లో ఎలాంటి నష్టం వాటిల్లకపోయినా.. మానవ వినాశనమే అన్న భయంతో అల్లాడిపోయారు. కంటిమీద కునుకు లేకుండా గడిపారు. కానీ ఇప్పుడు కరోనా కళ్ల ముందే ప్రభావం చూపుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో వణికిపోతున్నారు జనం.
బ్రహ్మం గారి మాటే..
తూర్పు దిక్కున కోరంగి వ్యాధి పుట్టి కోటి మంది చస్తారంటూ.. పోతూలూరి బ్రహ్మం గారు.. తన కాలజ్ఞానంలో చెప్పారన్న ప్రచారం కొద్ది రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మారణ హోమం సృష్టిస్తున్న కరోనా వైరసే కోరంగి అంటలూ సామాజిక మాధ్యమాల్లో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.ఇదే తరహాలో స్కైలాబ్ పడుతుందన్నప్పుడు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రచారం జరిగింది. కలియుగాంతం దగ్గరపడిందని, ఆ విషయాన్ని బ్రహ్మంగారు ముందే చెప్పారని, ఆ ప్రళయం స్కైలాబ్ రూపంలో వచ్చిందంటూ ఊరూరా ప్రచారం జరిగింది. పల్లెల్లో రాత్రి వేళ బ్రహ్మంగారి మాటగా ఆటపాటలతో ప్రచారం చేసిన వారూ ఉన్నారు.
స్కైలాబ్..ఓ మానవతప్పిదం..
స్కైలాబ్,.. అంతరిక్ష పరిశోధక నౌక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీన్ని రూపొందించింది. కక్ష్యలోకి ప్రవేశపెట్టిన దీని జీవిత కాలం ఏడేళ్లే. అయితే ఆ తర్వాత దీన్ని భూమి మీదకు ఎలా తీసుకురావాలన్న విషయంలో నాసా సరిగా వ్యవహరించలేదు. ఈ లోపే ల్యాబ్ కాస్తా గతి తప్పడం మొదలైంది. 1978 చివరలో దీన్ని గుర్తించారు. చివరకు అది వేగంగా వచ్చి భూమిని ఢీకొనడం తప్ప వేరే మార్గం లేదని అంతా భావించారు. అదే విషయాన్ని నాటి ప్రధాన ప్రసార మాధ్యమం అయిన రేడియో తేల్చిచెప్పింది. అంతే ఇది విన్న జనాలు విపరీత భయాందోళనలకు గురయ్యారు. అది కాస్తా అటుఇటుగా భారత భూభాగంలోనే ఢీ కొంటుందన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో పత్రికల్లో వెలువడ్డ వార్త మరింత ఆందోళనకు దారితీసింది. తెలంగాణలోని నిజామాబాద్ మొదలు తీరం వరకు ఎక్కడైనా పడే అవకాశం ఉందంటూ ఓ మ్యాప్ ప్రచురితమైంది ఓ పత్రికలో.. అప్పట్లో ఊరూరా పత్రికలు వచ్చేవి కావు.. అయినా ఆ నోటా.. ఈ నోటా ఈ వార్త దావనంలా వ్యాపించింది.
అది నాసా ప్రయోగానికి సంబంధించిన ల్యాబ్ అన్న విషయంపై కొద్ది మందిలోనే ఉంది. చాలా మంది ఆకాశం నుంచి నక్షత్రం లాంటిది భూమిని ఢీకొనబోతోందని, దీంతో ప్రళయం వస్తుందని, మనుషులంతా చనిపోతారన్న ప్రచారం ఎక్కువైంది. అప్పటికే నిపుణులు 1979 జూన్లో దాన్ని సముద్రంలో కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయం చాలా మందికి చేరే సరికి కాస్త ఆలస్యం అయింది. స్కైలాబ్ భూమిని ఢీకొంటుందన్న విషయం మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. ఇంకేముంది.. చావు దగ్గరపడిందని భావించి జనంలో విషాదం అలుముకుంది. దీంతో పనీపాట ఆపేసి.. బంధువులను చివరి మాటలు’చెప్పుకోవడానికి పిలుచుకున్నారు. శాఖాహారులైతే వీలైనన్ని పిండివంటలు వండుకుని తినడం ప్రారంభించారు. పూటకు తీరొక్క వంటకాలు ఘుమఘుమలాడించారు. ఆడబిడ్డలను ఇళ్లకు పిలిపించుకున్నారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసి పండుగ చేసుకున్నారు. ఇక మాంసాహారులైతే ఇంట్లో ఉన్న మేకలు, కోళ్లను మొత్తం వండుకుని తినేశారు. అందుబాటులో ఉన్న మద్యం తాగేసి.. ఒకరిని పట్టుకుని ఒకరు ఏడవడం మొదలు పెట్టారు. అలా మూడు వారాల పాటు ఇలాగే గడిపారు.
గొర్ల మందలను దాచేశారు..
‘తెలంగాణ మొత్తం స్కైలాబ్ బారిన పడుతుందన్న ప్రచారం ముమ్మరంగా సాగింది. దీంతో చదువుకున్న వారు.. చదువులేని వారు అన్న తేడా లేకుండా ఆందోళనకు గురయ్యారు. తమకున్న కోళ్లు, మేకలను వండుకుని తిన్నారు. పశువులను చాలామంది దాచేశారు. ఇళ్లలో ఉంటే కొంత మేలని ప్రచారం జరగడంతో.. గొర్లను, పశువులను ఇళ్లలో దాచేసుకున్నారు.’ – రంగాచార్యులు,హన్మకొండ
హెలీకాప్లర్లలో రక్షిస్తారన్న పుకారు పుట్టింది..
‘స్కైలాబ్ వార్త తెలిసినప్పటి నుంచి రోజూ సాయంత్రం మా ఇంటి వద్ద జన సమూహం ఉండేది. నా దగ్గర ఉన్న రేడియోలో వార్తలు వినేందుకు వచ్చేవారు. అది కూలడానికి రెండు రోజుల ముందు.. సముద్రంలో కూల్చేస్తారని తెలిసింది. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను హెలికాప్లర్ల ద్వారా రక్షిస్తారని సాధారణ రైతులు చనిపోతారన్నది దాని సారాంశం. నాకోసం వచ్చే హెలికాప్టర్లలో వాళ్లు కూడా రావొచ్చని రైతులు ఆశపడ్డారు.’ – హరగోపాల్, రిటైర్డ్ టీచర్, ఆలేరు