మిమ్మల్ని జైలుకు పంపాలా : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి వివరాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై భారత రిజిస్ట్రార్ జనరల్(ఆర్జీఐ) శైలేష్, ఎన్ఆర్సీ కోఆర్డినేటర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ఆర్సీఎన్ఆర్సీ జాబితా గురించి మీడియా ఎదుట మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించింది. మీరు కోర్టుచే నియమితులైన వారన్న సంగతి మరిచారా? అని నిలదీసింది.
కాగా, ఎన్ఆర్సీ కో-ఆర్డినేటర్ ప్రతీక్ హజేలా, ఆర్జీఐ శైలేష్ సోమవారం ఎన్ఆర్సీపై ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్ఆర్సీలో పేర్ల నమోదుకు 2015 ఆగష్టు 31లోగా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ప్రస్తుత ముసాయిదాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని హజేలా, శైలేష్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
‘మీ ఉద్యోగం ఎన్ఆర్సీ జాబితాను రూపొందించడం వరకు మాత్రమే. మీరు కోర్టు నియమించిన అధికారులని మరిచిపోవద్దు. మేం ఇచ్చిన ఆదేశాలను పూర్తి చేయడమే మీ ఉద్యోగం. మీరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఎలా మాట్లాడతారు? అలా చేయమని మీకు ఎవరు చెప్పారు? అసలు మీకు ఆ అధికారం ఎవరు ఇచ్చారు?. మీరు చేసిన పని కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. మిమ్మల్ని జైలుకు పంపించాలా? మిమ్మల్నిద్దరినీ శిక్షించాలా?’ అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్తో కూడిన ధర్మాసనం ఇరువురు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.