చలో అయోథ్యతో సేన దూకుడు
సాక్షి, ముంబై : ఉత్తర్ ప్రదేశ్లో త్వరలో పర్యటిస్తానని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ప్రకటించిన మరుసటి రోజే పార్టీ సీనియర్ నేత గురువారం చలో అయోధ్య, చలో వారణాసి కార్యక్రమం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ పోస్టర్లు, హోర్డింగులతో థాకరే సన్నిహిత నేత మిలింద్ నర్వేకర్ హంగామా పలువురిని ఆకట్టుకుంటోంది. దేశ రాజకీయాల్లో చలో అయోధ్య, చలో వారణాసి కీలక ముందడుగుగా నిలుస్తుందని సేన వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు త్వరలో తాను అయోధ్య, వారణాసిలను సందర్శిస్తానని బుధవారం సేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. తాను వారణాసి, కాశీ క్షేత్రాలను సందర్శిస్తానని, గంగా హారతిలో పాల్గొంటానని థాకరే వెల్లడించారు. గంగానది ఇప్పుడు ఎలా మారిందో పరిశీలిస్తానని, శ్రీరాముడి దర్శనం కోసం అయోధ్య వెళతానని చెప్పుకొచ్చారు. పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాకరే ఈ వివరాలు వెల్లడించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని బీజేపీ చెబుతున్నా ఎప్పుడు పనులు చేపడతారో ఎవరికీ తెలియదని అంటూ రామ మందిర కార్డును మళ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకుంటారని ఆ పార్టీ సంకేతాలు పంపుతోందన్నారు.