ఆ తల్లి చేసింది తప్పేనా?
సాక్షి, ముంబై: డ్రగ్స్ మత్తు.. ఆపై స్త్రీల వ్యామోహం ఆ రాక్షసుడిని మరింతగా దిగజార్చాయి. వరుసగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. చివరకు కన్నతల్లిని వదల్లేదు. మరికొంత మంది మహిళల జీవితం నాశనం కాకముందే ఆ కిరాతకుడిని కడతేర్చాలని నిర్ణయించుకుంది. సుఫారీ గ్యాంగ్తో హత్య చేయించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
21 ఏళ్ల రామ్చరణ్ రామ్దాస్ ద్విదేదీ మాదక ద్రవ్యాలకు బాగా అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ వస్తున్నాడు. చివరకు తన కన్నతల్లి, పిన తల్లిని కూడా వదల్లేదు. దీంతో తన పెద్ద కొడుకు సీతారాంతో కలిసి రాంచరణ్ను హత్య చేయించాలని నిర్ణయించుకుంది.
తమ కుటుంబానికి స్నేహితులైన కేశవ్ మిస్ట్రీ, రాకేశ్ యాదవ్లను అందుకు పురమాయించి 50,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆగష్టు 20 పక్కా ఫ్లాన్తో చరణ్ను తమ వెంట తీసుకెళ్లిన నిందితులు గొంతు కోసం చంపేశారు. మరుసటి రోజే అతని మృతదేహం పోలీసులు కనుగొనగా, శవం ఎవరిదో కనుగొనేందుకు చుట్టు పక్కల ప్రాంతాల్లో పోస్టర్లను అంటించారు. చివరకు సెప్టెంబర్ 14న అది చరణ్ మృతదేహంగా గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేయటంతో అసలు విషయం వెలుగు చూసింది.
రాంచరణ్ తల్లితోసహా నిందితులందరూ నేరం ఒప్పుకోవటంతో వారిని రిమాండ్కు తరలించినట్లు వాసవి ఏరియా పోలీస్ అధికారులు తెలిపారు. కిరాతకుడైన ఆ కొడుకు విషయంలో ఆ తల్లి చేసింది తప్పేం కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.