బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, లోక్సభ ఎంపీ చింతమన్ వనగ (67) కన్నుమూశారు. తన ఇంటివద్ద అనూహ్యంగా కుప్పకూలిన ఆయన అరగంటలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతికి కారణాలు పరిశీలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం చింతమన్ మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద అనూహ్యంగా పడిపోయారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి (ఆర్ఎంఎల్)కు తరలించారు.
‘చింతమన్ను మంగళవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మేం ఆయనను బతికించేందుకు అరగంటపాటు శ్రమించాం. అయినప్పటికీ ఆయన శరీరం స్పందించలేదు. దీంతో 11.45గంటలకు ఆయన చనిపోయినట్లు ప్రకటించాం’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీకే తివారి చెప్పారు. 1950 జూన్ 1న జన్మించిన వనగా మహారాష్ట్రలోని పాల్గఢ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తొలిసారి 11వ లోక్సభకు 1996లో ఎన్నికైన ఆయన ఆ తర్వాత 1999లో ఓసారి, తాజాగా 2014లో మరోసారి 16వ లోకసభకు ఎన్నికయ్యారు. కాగా, ఆయన మృతిపట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.