కాలుష్యం కాటేస్తున్నా స్పందించరేం: రాహుల్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై ఇటీవల ట్విట్టర్ వేదికగా పదునైన పంచ్లతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ప్రమాదకరంగా మారిన ఢిల్లీ వాయుకాలుష్యాన్ని ప్రస్తావించారు. పరిస్థితి తీవ్రతను ప్రతిబింబించేందుకు రాహుల్ బాలీవుడ్ పాపులర్ పాటను ప్రస్తావించడం గమనార్హం. తాజా ట్వీట్లో కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో సంబంధిత అధికారుల అలక్ష్యం, వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారు.
వాయు కాలుష్యానికి ఆప్ సర్కార్ ప్రవేశపెట్టిన సరి బేసి స్కీమ్పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంలో ఢిల్లీ సర్కార్ వైఫల్యాన్ని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎత్తిచూపిన నేపథ్యంలో రాహుల్ ట్వీట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలకు పెరిగి ప్రజారోగ్యంపై పెనుప్రభావం చూపుతున్న విషమయం తెలిసిందే.
పీఎం 2.5,. పీఎం 10 స్థాయిలు వరుసగా 480, 712 మైక్రోగ్రాములుగా కొనసాగుతుండటంతో ఎమర్జెన్సీ పరిస్థితి యథాతథంగా ఉందని అధికారులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నవంబర్ 13-17 మధ్య సరి బేసి పద్ధతిని అనుసరించాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ సర్కార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.