వంకలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
చింతామణి(కర్ణాటక): ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం కర్ణాటకలోని కోలారు జిల్లా, శ్రీనివాసపురం తాలూకాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయట పడ్డారు. వివరాలు.. చింతామణి డిపోకు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో మదనపల్లి నుంచి బెంగళూరుకు బయల్దేరింది. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో వాహనం రాయలపాడు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన వంకలోకి దూసుకెళ్లింది.
అయితే చెట్లను ఢీకొట్టకుండా డ్రైవర్ వాహనాన్ని నియంత్రించారని, దీంతో పెను ప్రమాదం తప్పి ప్రాణాలతో బయట పడ్డామని కొందరు ప్రయాణికులు పేర్కొన్నారు. చింతామణి ఆర్టీసీ డిపో అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించివేసి బస్సును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.