ఎవరీ రీతు మహేశ్వరి?
సాక్షి, న్యూఢిల్లీ : మన దేశంలో ఏళ్లకు ఏళ్లుగా బహిరంగ దోపిడీ జరుగుతోంది. అదే విద్యుత్ చౌర్యం. మన దేశంలో ఇది అత్యంత సాధారణంగా మారిపోయిన విషయం. ప్రభుత్వం దగ్గరున్న అధికారిక లెక్కల ప్రకారం.. దేశంలో ప్రతి ఏడాది రూ.66 వేల కోట్ల రూపాయల విద్యుత్ ను చోరి చేస్తున్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పరిశ్రమలు కూడా ఇందులో ఉన్నాయి.
విద్యుత్ దొంగతనాన్ని 39 ఏళ్ల మహిళా అధికారిణి రీతు మహేశ్వరి సమర్థవంతంగా అడ్డుకున్నారు. 2011లో కాన్పూర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేరిన ఆమె.. మొదటి నుంచి విద్యుత్ చౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా విద్యుత్ వినియోగదారుల ఇళ్లలో మూడొంతుల మందికి కొత్త మీటర్లను బిగించడంతో పాటు, రోజువారీ విద్యుత్ వినియోగంపై రియల్ టైమ్ డిజిటల్ రీడింగ్ను నమోదు చేయిస్తూ, మెల్లిగా విద్యుత్ చౌర్యాన్ని ఆమె అరికట్టేందుకు కృషి చేస్తున్నారు.
కాన్పూర్కు 11 నెలల క్రితం బదిలీపై వచ్చిన మహేశ్వరి, చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకునే కరెంటు కనెక్షన్లపై ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని సైతం విడుదల చేశారు. లక్షలాది మంది గృహ వినియోగదారులకు, పంట పొలాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ కావాలంటే, చౌర్యాన్ని అరికడితే సరిపోతుందని వెల్లడించే ఆమెకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహమూ లభిస్తోంది.