యువతికి రాంచీ కోర్టు వినూత్న శిక్ష
రాంచీ : ఓ మతాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 19 ఏళ్ల యువతికి ఐదు కాపీల ఖురాన్ను పంచాలని రాంచీ కోర్టు వినూత్న శిక్ష విధించింది. మతపరమైన పోస్ట్ను షేర్ చేసిన కళాశాల యువతి రిచాభారతిని అంజుమన్ ఇస్లామియా కమిటీకి ఓ పవిత్ర ఖురాన్ కాపీని అందించడంతో పాటు మిగిలిన నాలుగు కాపీలను విభిన్న పాఠశాలలు, కళాశాలల లైబ్రరీలకు అందచేయాలని జ్యుడిషిల్ మేజిస్ర్టేట్ మనీష్ కుమార్ ఆదేశించారు.
రాంచీ కోర్టు తీర్పును హిందూ సంస్థల ప్రతినిధులతో పాటు బీజేపీ నేతలు ఆక్షేపించారు. స్ధానిక కళాశాలలో ప్రధమ సంవత్సరం చదువుతున్న రిచాభారతిని మైనారిటీ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకర పోస్ట్ను షేర్ చేశారనే ఆరోపణలపై శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రిచాభారతి అరెస్ట్ను పలు హిందూ సంఘాలు, సంస్ధలు ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. రూరల్ ఎస్పీ అశుతోష్ శేఖర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో కోర్టుకు తమ సమ్మతి తెలిపిన మేరకే రిచాభారతికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.