అనిల్ అంబానీకి దోచిపెడుతున్నారు: రాహుల్
భువనేశ్వర్ : ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత సేనలకు చెందిన సొమ్మును ప్రధాని మోదీ తన సన్నిహితుడు అనిల్ అంబానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. భారత వాయుసేన ఇటీవల పాక్ ఉగ్రవాద శిబిరంపై దాడులు చేపట్టిందని, మన సైనికులూ వీరమరణం పొందారని రాహుల్ పేర్కొంటూ ప్రధాని మోదీకి చురకలంటించారు. ఒడిషాలోని కోరాపుట్లో శుక్రవారం జరిగిన ఓ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఏడు దశాబ్ధాలుగా ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వాయుసేనకు విమానాలను రూపొందిస్తోందని రాహుల్ చెప్పుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దేశభక్తి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ వైమానిక దళం నుంచి సొమ్మును రాబట్టి దాన్ని అనిల్ అంబానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి భాగస్వామ్యం దక్కేలా ప్రధాని నరేంద్ర మోదీ లాబీయింగ్ చేశారని, తన కార్పొరేట్ సన్నిహితులకు దోచిపెట్టడం మోదీకి అలవాటని గతంలోనూ రాహుల్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.