ఐఎన్ఎస్ విరాట్లో విహార యాత్రా..?
సాక్షి, న్యూఢిల్లీ : తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత జలాల గస్తీ నౌక ఐఎన్ఎస్ విరాట్లో ఆయన వెంట ఉన్నానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అంగీకరించారు. అయితే ఆ నౌకలో తమ కుటుంబం పది రోజలు పాటు విహరించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆ నౌకలో తాము హాలిడేను గడిపామనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. విహారానికి వెళ్లడానికి అదేమైనా క్రూయిజ్ షిప్ (నౌక) కాదని అన్నారు.
విమాన వాహక నౌకలో ఎవరూ విహారానికి వెళ్లరని చెప్పారు. జాతీయ దినపత్రిక హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ మోదీ ఆరోపణలపై రాహుల్ వివరణ ఇచ్చారు. కాగా రాజీవ్ కుటుంబం ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్లో పది రోజుల పాటు విహార యాత్రకు వెళ్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ర్యాలీలో ఆరోపించిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబం ఐఎన్ఎస్ విరాట్ను వారి వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని మోదీ వ్యాఖ్యానించారు.