చైనాకు బయలుదేరిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో సుహృద్భావ సంబంధాల దిశగా మరో అడుగు పడనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం చైనా పర్యటనకు ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరారు. ఈ నెల 27, 28 తేదీల్లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య భేటీకి ముహూర్తం కుదిరింది. చైనాలోని హుబీ ప్రావిన్సులోని వుహన్ నగరంలో ఈ అనధికార శిఖరాగ్ర సదస్సు జరగనుంది. జిన్పింగ్ ఆహ్వానం మేరకు మోదీ చైనా పర్యటనకు రానున్నారని భారత్, చైనాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, వాంగ్ యి ఆదివారం సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ భేటీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వివాదాస్పద అంశాల పరిష్కారం, అంతర్జాతీయ సమస్యలు.. తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. డోక్లాం సహా పలు సరిహద్దు వివాదాలు, ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, ఉగ్రవాది మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా మోకాలడ్డడం తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.