సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే దేశానికి పెనుముప్పు
బహుభాషా నటుడు ప్రకాశ్రాజ్ వ్యాఖ్యలు
తమిళ సినిమా(చెన్నై)/శివాజీనగర (బెంగళూరు): సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే దేశానికి పెనుముప్పేనని బహుభాషా నటుడు ప్రకాశ్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య ఉదంతంపై స్పందించిన ప్రకాశ్రాజ్.. ప్రధాని నరేంద్ర మోదీ తన కంటే గొప్ప నటుడంటూ విమర్శలు చేశారు.
తాజాగా ఆదివారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం వల్ల దేశం నాశనమవుతుందన్నారు. ప్రజలు కూడా అభిమానంతో కాకుండా బాధ్యతగల పౌరులుగా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వచ్చే వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. సినీనటులు కమలహాసన్, రజనీకాంత్, ఉపేంద్ర, పవన్ కల్యాణ్తో పాటు ఏ భాషకు చెందిన నటుడైనా పార్టీ స్థాపిస్తే వారికి ఓటు వేయరాదని, వ్యక్తిగత అభిమానం వేరు, ఓటు వేయడం వేరని స్పష్టం చేశారు.
బెదిరింపులకు భయపడను
జీఎస్టీ, గౌరీలంకేశ్ హత్య తదితర అంశాల గురించి తాను మాట్లాడితే హత్య చేస్తామని బెదిరింపులకు దిగారని, అలాంటివాటికి భయపడేది లేదని ప్రకాశ్రాజ్ స్పష్టంచేశారు. తాను ఏ పార్టీకి, వర్గానికి చెందినవాడిని కాదన్నారు.