సమైక్య భారత్కే మా మద్దతు: ట్రూడో
న్యూఢిల్లీ/ముంబై: కెనడా ప్రభుత్వం, తాను సమైక్య భారత్కే మద్దతు ఇస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఈ విషయం లో తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు ట్రూడో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్న విమర్శల నేపధ్యంలో ఆయన స్పందించారు.
మంగళవారం ముంబైలో జరిగిన ఓ సమావేశం లో ట్రూడో మాట్లాడుతూ.. భారత్–కెనడాల మధ్య సంబంధాలు కేవలం రాజకీయ పరమైనవి మాత్రమే కావనీ, సాంస్కృతిక, ఆర్థిక రంగాలతో పాటు ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అయితే ఖలిస్తాన్ వేర్పాటువాదులకు కెనడా ప్రభుత్వ మద్దతు వల్లే భారత్–కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయని పలువురు కెనడియన్లు ఆరోపిస్తున్నారు.
లింగ అసమానతల్ని అంతం చేయాలి
ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానత్వాన్ని అంతం చేయాలని కెనడా ప్రధాని భార్య సోఫీ గ్రెగొరీ ట్రూడో ప్రజలకు పిలుపునిచ్చారు. దీనివల్ల ఇప్పటికే ప్రపంచం చాలా నష్టపోయిందన్నారు. ముంబైలోని సోఫియా మహిళా కాలేజీలో ఆమె మాట్లాడారు.