భార్య లే ని లోకంలోబతకలేక..
న్యూఢిల్లీ: భార్య మృతి తట్టుకోలేక భర్త బలవన్మరణం చెందిన విషాద ఘటన ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలోని షాదరాలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన విజయ్(28), గీతలు దంపతులు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. విజయ్ ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
గత నెల 22న గీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి కుమారుడి ఆలనాపాలనా విజయ్ చూసుకుంటున్నాడు. తనభార్య లేని లోకంలో తాను కూడా బతకలేనని పలు సందర్భాల్లో తన బంధువుల వద్ద వాపోయేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఫ్యాన్కి ఉరివేసుకుని విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహం వద్ద పడి ఉన్న సూసైడ్ నోట్ని స్వాదీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలేమీ లేఖలో వెల్లడికాకపోయినా తన భార్య మృతిచెందిన తరువాత ఒంటరి బతుకు బతకలేక తాను కూడా చనిపోతున్నట్లు విజయ్ ఆ లేఖలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.