లాక్డౌన్ ఎఫెక్ట్ : జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు
వేతన వెతలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే 31 వరకూ పొడిగించడంతో దినసరి కూలీలతో పాటు పలు సంస్ధల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు చెల్లించడం లేదంటూ నోయిడాలోని ఓ కంపెనీ వెలుపల సోమవారం వందలాది ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. మార్చి నుంచి తమకు వేతనాలు చెల్లించడం లేదని ఉద్యోగులు వాపోయారు. యాజమాన్యం తీరును ఆక్షేపిస్తూ ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్యోగుల నిరసన నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను వారు ఉల్లంఘించారు.
తమకు మార్చి నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో నిత్యావసరాల కొనుగోలుకూ తమ వద్ద డబ్బు లేకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని ఉద్యోగులు పేర్కొన్నారు. తమతో సంప్రదింపులు జరిపేందుకు యాజమాన్యం నుంచి ఏ ఒక్కరూ ముందుకు రాలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనలతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో పలుచోట్ల వేతనాల కోసం కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజా మార్గదర్శకాలతో పలు పరిశ్రమలు పునరుద్ధరించడంతో పరిస్ధితి కొంత మెరుగైంది. కాగా సోమవారం నోయిడాలో మరో నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో ఈ ప్రాంతంలో పాజిటివ్ కేసుల సంఖ్య 247కు చేరిందని జిల్లా అధికారులు వెల్లడించారు.