కరోనా బాధితుల్లో ఎక్కువమంది ఈ వయస్సు వారే!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారిన పడిన భారతీయుల్లో ఎక్కువ మంది 21నుంచి 60 మధ్య వయస్సు గల వారేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. శనివారం మొదటిసారి కరోనా బాధితుల ఏజ్ ప్రొఫైల్ను విడుదల చేసింది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దేశ వ్యాప్తంగా 2,902 మందికి కరోనా పాజిటివ్ రాగా, 68 మంది మృతి చెందారని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 184 మంది కోలుకున్నారని వెల్లడించింది. 2,902 మందిలో 1,213 మంది 21- 40.. 951 మంది 41-60.. 484 మంది 60 సంవత్సరాలు పైబడ్డ వారని తెలిపింది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దాదాపు 58 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఎక్కువ మంది కేరళ, మధ్య ప్రదేశ్, ఢిల్లీకి చెందిన వారే ఉన్నారు. (ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు! )
జనవరి నుంచి ఇప్పటివరకు 2,902 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. చనిపోయిన 68 మందిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. మరణాల విషయానికి వస్తే.. వృద్ధులు, హై బీపీ, డయాబెటీస్, కిడ్నీ, గుండె సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు అధికంగా ఉన్నారు. ఈ సమస్యలు ఉన్నవారు ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాల’ని ఆయన విజ్ఞప్తి చేశారు. ( ‘పాకిస్తాన్ ఏటీసీ వ్యాఖ్యలతో ఆనందం, ఆశ్చర్యం..’ )