మోదీ ఆదేశాలతోనే జీఎస్టీ మార్పులు
సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా విధాన నిర్ణయాల్లో మార్పులకు వెనుకాడదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జీఎస్టీ అమలులో వాస్తవ ఇబ్బందుల గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ ఆ మేరకు సవరణలు చేపట్టాలని ఆదేశించారన్నారు. ఏమైనా చట్ట సవరణలు అవసరమని భావిస్తే వాటిని వెనువెంటనే తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు వస్తుందన్నారు.
ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి భేటీలో తీసుకున్న నిర్ణయాలతో వ్యాపారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. జీఎస్టీలో ఆచరణాత్మక ఇబ్బందుల గురించి తెలుసుకున్న ప్రధాని వాటిని తొలగించేందుకు అవసరమైన సవరణలు చేపట్టాలని విస్పష్టంగా సూచించారన్నారు. ప్రజల కష్టాలు గుర్తెరిగి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు.