జవాన్లే దేశానికి బలం : మోదీ

Modi celebrates Diwali with Jawans - Sakshi

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో భారత్‌ చైనా సరిహద్దులోని  హార్సిల్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవాన్లను ప్రధాని మోదీ కలుసుకుని వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎత్తైన శిఖరాలపై మంచును సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు దేశానికి బలం అని మోదీ కొనియాడారు. 125 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుకు, వారి కలలకు జవాన్లు భద్రతనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కేదార్‌నాథ్‌ను సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. కేదార్‌పురి పునర్నిర్మాణ పనులను మోడీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.

2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి కావడం గమనార్హం. కాగా, 2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో సైనిక జవాన్లతో జరుపుకున్నారు.  తదుపరి ఏడాది 1965 ఇండో-పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్‌ బోర్డర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top