దేశానికి ఉపయోగపడే అంశాల్లో మద్దతు

దేశానికి ఉపయోగపడే అంశాల్లో మద్దతు - Sakshi


రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ ఎంపికను స్వాగతిస్తున్నాం: కేటీఆర్‌



సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశానికి ఉపయోగపడే ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కేటీఆర్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ గవర్నర్‌ రాంనాథ్‌ కోవింద్‌ను బీజేపీ ఎంపిక చేయడంపై తమ మద్దతు తెలిపారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక వైఖరినే అవలం బిస్తోందని, గతంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని, జీఎస్టీకి పూర్తి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని తమ పార్టీ కోరుకుంటోందన్నారు. ఒక విద్యావేత్తను, దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని పూర్తిగా స్వాగ తిస్తున్నామన్నారు. వెంకయ్యను కలసిన సందర్భంగా కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీ జాబి తాలో చేర్చాలని కోరినట్లు తెలిపారు.



అలాగే రాష్ట్రంలోని 73 పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చే కార్యక్రమం జూలైలో నిర్వహిస్తున్నా మని, దాని ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ నెల 23న స్మార్ట్‌ సిటీల తదుపరి జాబితా విడుదల చేయనున్నామని, కరీంనగర్‌ను జాబితాలో చేర్చడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య హామీ ఇచ్చా రు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును విభజన చట్టంలో పొందుపరిచారని, అయితే కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల అది జటిలమవుతోందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు వెంకయ్య సమాధానం ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top