ప్రభుత్వ పాఠశాలలో యోగా పాఠాలు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాశాఖలో వినూత్న కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం (ఆప్) శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆనంద పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు యోగా, నైతిక విలువలు, మానసిక ఉల్లాసంపై అవగహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్ల మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 2న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులకు విద్యతో పాటు మానసిన ఎదుగుదల చాలా ముఖ్యమని, ప్రతిరోజు నిపుణలతో క్లాసులు భోదించేందుకు ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు. ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయంను సందర్శించిన సందర్భంగా అక్కడి అధికారులు తమకు ఈ పాఠ్య ప్రణాళిక గురించి వివరంగా చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వం గత ఐదు నెలలుగా 40 మంది నిపుణులతో చర్చించి, ఆనంద పాఠ్య ప్రణాళికను రూపొందించామని, రాష్ట్రంలోని 1000 పాఠశాల్లో చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మనీశ్ సిసోడియా ప్రకటించారు.