మేజర్ ఆదిత్యకు శౌర్య పురస్కారం
న్యూఢిల్లీ: మేజర్ ఆదిత్య కుమార్, సిపాయి ఔరంగజేబుతో పాటు మరో 20 మంది భద్రతా సిబ్బందికి కేంద్రం శౌర్యచక్ర అవార్డులు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ శాఖ ఈ జాబితాను విడుదలచేసింది. జనవరిలో కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రాళ్లు విసురుతున్న మూకపై మేజర్ ఆదిత్య నేతృత్వంలోని బలగాలు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. పుల్వామాకు చెందిన ఔరంగజేబు జూన్లో రంజాన్ వేడుక నేపథ్యంలో సొంతూరు వెళ్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్చేసి హత్యచేశారు.
ఈ రెండు ఘటనలు కశ్మీర్లో వివాదమయ్యాయి. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన 14 మంది అధికారులు రాష్ట్రపతి పతకాలకు ఎంపికయ్యారు. 29 మంది సీఐఎస్ఎఫ్ అధికారులనూ రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి. సిపాయ్ విరహ్మా పాల్సింగ్కు మరణానంతరం కీర్తిచక్ర అవార్డు ప్రకటించారు. ఐఎన్ఎస్ తరుణిలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఆరుగురు మహిళా నేవీ అధికారులకు నౌ సేనా మెడల్స్ దక్కాయి.