దినకరన్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌ విచారణకు హైకోర్టు ఓకే

దినకరన్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌ విచారణకు హైకోర్టు ఓకే - Sakshi

సాక్షి,చెన్నైః ఫిరాయింపు నిరోధక చట్టం కింద 18 మంది దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలపై తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత వేటు వేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సత్వర విచారణకు మద్రాస్‌ హైకోర్టు అంగీకరించింది. ఎమ్మెల్యేల తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది పీఆర్‌ రామన్‌ వినతిపై జస్టిస్‌ ఎం దొరైస్వామి సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించిన పక్షంలో పిటిషన్‌పై సత్వర విచారణ జరపకుంటే 18 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడం కోల్పోతారని, ఇది వారి రాజ్యాంగ హక్కులపై ప్రభావం చూపుతుందని న్యాయవాది కోర్టుకు నివేదించారు.

 

ఈ అంశాన్ని బుధవారం విచారణకు అనుమతిస్తామని జస్టిస్‌ దొరైస్వామి స్పష్టం చేస్తూ సరైన పిటిషన్‌తో ముందుకు రావాలని ఆదేశించారు. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ ఇచ్చిన 18 మంది దినకరన్‌ గ్రూపుకు చెందిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ పీ ధన్‌పాల్‌ అనర్హత వేటు వేసిన విషయం విదితమే. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top