యువ రక్తం వర్సెస్ రాజకీయ అనుభవం
మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల సీఎం ఎంపిక రాహుల్కు పెద్ద పరీక్షగా మారింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. పార్టీలో యువరక్తం అవసరమని భేటీలో రాహుల్తో పాటు ఆయన సోదరి ప్రియాంక భావించారు. కొత్త తరం ఆకాంక్షలను పూర్తి చేయాలంటే యువ నేతలకే అవకాశమివ్వాలని ప్రియాంక వాదించారు. అందువల్ల మధ్యప్రదేశ్లో సింధియాకు, రాజస్తాన్లో పైలట్కు అవకాశమివ్వాలని సూచించారు. ఈ వాదనతో రాహుల్ కూడా ఏకీభవించారు. అయితే, రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు రాజకీయ అనుభవం అవవసరమని సోనియాగాంధీ భావించారు.
పార్టీలో అంతర్గత విభేదాలను, సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాలను సమర్ధవంతంగా నడపడం సీనియర్లకే సాధ్యమన్నారు. ఈ రెండు కీలక రాష్ట్రాల నుంచి అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవాలంటే సీనియర్లకే అవకాశం ఇవ్వడం సముచితమని ఆమె వాదించారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అవసరమైన నిధుల సమీకరణ సీనియర్లకే సాధ్యమవుతుందని ఆమె రాహుల్ను ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్కు కమల్నాథ్ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.