నదిలో మునిగిన ఏనుగును కాపాడేందుకు..
తిరువనంతపురం : డ్యామ్ గేట్లను మూడు గంటల పాటు నిలిపివేసి వరదల్లో చిక్కుకున్న ఓ ఏనుగును కాపాడారు కేరళ ఫారెస్ట్ అధికారులు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో శ్రిశూర్ జిల్లాలోని అతిరాపల్లి జలపాతం సమీపంలో ఓ ఏనుగు వరదల్లో చిక్కుకుపోయింది. భారీ వరద రావడంతో ఏనుగు జలపాత సమీపంతోని రాతి గుట్టపై 24 గంటల పాటు నిలబడి ఉంది. ఇది గమనించిన జంతుప్రేమికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
చుట్టూ వరద నీరు ముంచేయడంతో ఏనుగు రాతి గుట్టపైనే ఒక రోజు అంతా నిలబడి ఉంది. ఫారెస్ట్ అధికారులు కూడా ఏమి చేయలేకపోయారు. చివరకి పెరింగల్కోత్ డ్యామ్ అధికారులకు సమాచారం ఇచ్చి మూడు గంటలపాటు గేట్లను మూసేసి ఏనుగును కాపాడారు. ‘ ఏనుగు ఒక రోజంతా చిన్న గుట్టపై నిలబడి ఉంది. దాని చుట్టూ నీరు చేరడంతో అది ఎటూ పోలేదు. నీటిని నిలిపివేస్తే ఏనుగును కాపాడవచ్చని భావించి గేట్లను మూసేయమని కోరాం. నీటి ఉద్రిక్తత తగ్గిన తర్వాత బాంబులతో శబ్దం చేసి ఏనుగును అడవిలోకి పోయేలా చేశాం’ అని సినియర్ ఫారెస్ట్ అధికారి పేర్కొన్నారు. కాగా ఏనుగు కాపాడినందుకు జంతు ప్రేమికులు హర్హం వ్యక్తం చేశారు.