రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ఎన్నిక
చెన్నై : డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తనయ కనిమొళి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. డీఎండీకే అభ్యర్థి ఇళంగోవన్ పరాజయం పాలయ్యారు. తమిళనాడులో ఆరు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. నలుగురు అన్నాడీఏంకే సభ్యులు మైత్రేయన్, అర్జునన్, రత్నవేల్, డాక్టర్ లక్ష్మణన్ తో పాటు సీపీఐ అభ్యర్థి రాజా గెలుపొందారు. 235 మంది సభ్యులున్న శాసనసభలో 231 మంది ఓట్లు వేశారు. మూడు ఓట్లు కలిగివున్న పీఎంకే ఎన్నికలకు దూరంగా ఉంది. ఒక ఓటు చెల్లలేదు.
ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు పోటీ పడ్డారు. ఎన్నికల రేసులో అన్నాడీఎంకే, సీపీఐ, డీఎంకే, డీఎండీకే నిలిచారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మొత్తం 151 మంది సభ్యులు కలిగిన అన్నాడీఎంకే రాజ్యసభ అభ్యర్థులు మైత్రేయన్, అర్జునన్, రత్నవేల్, డాక్టర్ లక్ష్మణన్ సునాయంగా గెలుపు సాధించారు. జయలలిత సాయంతో ఐదో స్థానంలో సీపీఐ అభ్యర్థి డి.రాజా గెలుపొందారు.
మిగిలిన ఒక స్థానం కోసం డీఎంకే అభ్యర్థి కనిమొళితో డీఎండీకే అభ్యర్థి ఇళంగోవన్ పోటీ పడ్డారు. డీఎండీకేకు 29 మంది సభ్యులున్నప్పటికీ వీరిలో ఏడుగురు జయ పంచన చేరారు. మిగిలిన 22 మంది సభ్యుల బలంతో ఆ పార్టీ ఎలా నెగ్గుకురాలేకపోయింది. ఐదుగురు సభ్యులన్న కాంగ్రెస్ అండగా నిలబడడంతో కనిమొళి నెగ్గారు. డీఎంకేకు ఉన్న 23 మంది ఎమ్మెల్యేల బలంతో పాటు మనిదనేయ మక్కల్, పుదియ తమిళగం పార్టీ నుంచి నాలుగు ఓట్లను కూడగట్టడంతో కరుణానిధి తనయ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
మరిన్ని వార్తలు