కశ్మీర్ లోయలో నేటి నుంచి హైస్కూళ్లు
శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేసిన పలు ప్రాంతాల్లో హైస్కూళ్లు నేటి నుంచి తెరచుకోనున్నాయి. ఇప్పటికే ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ప్రారంభం కాగా, టీచర్ల హాజరుశాతం పెరుగుతోందని సమాచార, ప్రజా సంబంధాల డైరెక్టర్ సెహ్రిశ్ చెప్పారు. ఆంక్షలు లేని ప్రాంతాల్లో దుకాణాలు తెరచుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే కశ్మీర్ లోయలో రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు.
కశ్మీర్పై ఉన్నత స్థాయి భేటీ..
కశ్మీర్ విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే విషయాలపై చర్చించేందుకు కేంద్ర ఉన్నతాధికారులు ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఏకే భల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో 15 మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కేంద్ర పథకాల అమలు విషయాలు చర్చకొచ్చాయి. రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు మైనారిటీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఆరుగురు అధికారుల బృందం మంగళవారం కశ్మీర్ లోయను సందర్శించింది.