‘అది దేశానికి మా విరాళం’
ధర పెంచినా తగ్గని మద్యం ప్రియులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సడలించిన అనంతరం మంగళవారం రెండో రోజు కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలు కొనసాగాయి. కేజ్రీవాల్ సర్కార్ మద్యం ధరల ఎమ్మార్పీపై ఏకంగా 70 శాతం ధరలు పెంచినా పొడవాటి క్యూలు ఏమాత్రం తగ్గలేదు. ఉదయం 9 గంటలకు మద్యం షాపులు తెరిచే క్రమంలో తెల్లవారుజామున 4 గంటల నుంచే మందు బాబులు షాపుల ముందు క్యూ కట్టారు.
భౌతిక దూరం పాటించాలనే నిబంధనను వారు ఏమాత్రం ఖాతరుచేయడం లేదు. పలు చోట్ల గుంపులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. లిక్కర్పై కరోనా పన్నును చెల్లించడం తమకు భారమేమీ కాదని, ఇది తమ నుంచి దేశానికి విరాళం లాంటిదేనని షాపుల ఎదుట బారులు తీరిన కొందరు మద్యం ప్రియులు చెప్పుకొచ్చారు. మద్యంపై 70 శాతం అదనపు పన్నును మంగళవారం నుంచి స్పెషల్ కరోనా ఫీజుగా వసూలు చేస్తామని కేజ్రీవాల్ సర్కార్ వెల్లడించిన సంగతి తెలిసిందే.