జమ్మూ కశ్మీర్ : అసెంబ్లీకి లేవు..లోక్ సభకే..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదని, కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో ఐదు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని చెప్పారు. కాగా ఉగ్రవాద ఘటనలు, ఇండో పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జాప్యం జరుగుతాయని భావించారు.
రాష్ట్ర అసెంబ్లీ రద్దవడంతో ఆరు నెలల్లోగా అసెంబ్లీకి తాజా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే జమ్మూ కశ్మీర్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అక్కడున్న సమస్యాత్మక పరిస్థితుల్లో సాధ్యం కాదని ఈసీ భావించింది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం పట్ల కేంద్రం నియమించిన గవర్నర్ సైతం విముఖత చూపినట్టు తెలిసింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ గడువు 2021, మార్చి 16 వరకూ ఉన్నా పాలక పీడీపీ-బీజేపీ సర్కార్ పతనమవడంతో అసెంబ్లీ రద్దయిన సంగతి తెలిసిందే.