వర్ష బీభత్సం: కుప్పకూలిన ఇళ్లు!
బెంగళూరు : కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు కొండచరియాలు విరిగిపడటంతో రవాణ స్థంభించింది. ముఖ్యంగా కొడుగు జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో సహాయక బృందాలు హెలికాప్టర్ సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది.
ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు అక్కడి దారుణ పరిస్థితి తెలుపుతున్నాయి. కొడుగు జిల్లా స్థానిక వాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చనీయాంశమైంది. ఆ వీడియోలో ఓ రెండంతస్థుల భవనం నాటకీయంగా ఓవైపు కుప్పకూలింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. భూమి కుంగిపోవడం వల్లే ఆ భవనం కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వరద బాధితుల కోసం రూ.200 కోట్ల రిలీఫ్ ఫండ్ను విడుదల చేసింది.