హైకోర్టులో దినకరన్ వర్గం పిటిషన్
సాక్షి, చెన్నై: శశికళ, దినకరన్లపై వేటు వేయటంతోపాటు, వాళ్లు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని అన్నాడీఎంకే పార్టీ చేసిన తీర్మానాలపై దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు గరగరంగా ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలంటూ గురువారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పళని ప్రభుత్వం మైనార్టీలో ఉందని, తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం అని పిటిషన్లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గవర్నర్ జాప్యం చేస్తున్నందునే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బెంచ్.. దినకరన్కు మద్ధతునిస్తున్న 19 మంది ఎమ్మ్యేలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇక మరోవైపు దినకరన్ వర్గంలోకి మరికొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. సర్వసభ్య సమావేశంలో వీకే శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ వారు ఈసీకి విజ్ఞప్తి చేశారు. త్వరలో శశికళను సంప్రదించి తాము అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తామని దినకరన్ వర్గ ఎమ్మెల్యే విజిల సత్యనంత్ తెలిపారు.