కరోనా: ఇప్పటివరకు కమ్యునిటీ ట్రాన్సిమిషన్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో భారత్లో ఇంకా కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శనివారం తెలిపింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు పది శాతం మందికి తీవ్రవైన శ్వాససంబంధ సమస్య ఉన్నట్లు తెలిపింది.
‘కరోనా లక్షణాలతో ఇప్పటివరకు సారీ హాస్పిటల్లో చేరిన 110 మందిలో దాదాపు పదకొండు మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే వారిలో చెన్నై, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురికి ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదు. కరోనా సోకిన వ్యక్తితోనూ వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇక కమ్యునిటీ ట్రాన్స్మిషన్ అనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు.’అని ఐసీఎంఆర్ శాస్ర్తవేత్త గంగాఖేద్కర్ అన్నారు.
ఇప్పటివరకు 150 ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్లలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సెల్ఫ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచితే, ప్రజలు ఎవరికివారు సరైన మార్గదర్శకాలు లేకుండా వాటిని వినియోగిస్తారని, దాని వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా డాక్టర్ల అనుమతి లేకుండా సొంత నిర్ణయాలతో మందులు వాడటం మంచిది కాదని చెప్పారు.
భారతదేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి దగ్గర్లో ఉంది. ఈ వైరస్ కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,40,589 కు చేరుకోగా, 29,848 మంది చనిపోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ జరిపిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్, మరణాల రేటు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా కరోనా వైరస్పై భారత్ చేస్తున్న పోరులో ప్రజలను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసే పౌరుల సౌకర్యార్థం అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీఎం-కేర్స్( ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్) ఫండ్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రకటించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.