లాక్డౌన్ సడలింపులు లేవు.. సీఎం నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి మినహాయింపులు లేకుండానే లాక్డౌన్ కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం రేపటి(ఏప్రిల్ 20) నుంచి లాక్డౌన్ నిబంధనలను మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే లాక్డౌన్ సడలిపులపై సీఎం కేజ్రీవాల్ ఆదివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలో ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉండటంతో సడలింపు ఇవ్వ కూడదని కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఎలాంటి మినహాయింపులు లేవని కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటించారు. కరోనా తీవ్రత, లాక్డౌన్ సడలింపుపై ఏప్రిల్ 27న మరోసారి సమీక్ష నిర్వహించి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.
కరోనా వైరస్ ప్రభావం ఢిల్లీలో అధికంగానే ఉంది. పాజిటివ్ కేసుల్లో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 71 కంటైన్మెంట్ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 42 మంది మరణించారు. ఈ క్రమంలో లాక్డౌన్ మినహాయింపులు ఇస్తే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ లాక్డౌన్ సమయంలో బయటకు రావద్దని సీఎం కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చదవండి:
కరోనా : మన నేవీ.. మహా భద్రం
పెళ్లి వాయిదా వేసుకున్న మహిళా డీఎస్పీ