‘ఆ సొమ్ము మహిళల ఖాతాల్లో వేస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపడితే దేశంలో ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 కనీస ఆదాయ హామీ పధకం కింద అందచేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన క్రమంలో ఈ స్కీమ్పై ఆ పార్టీ మరింత వివరణ ఇచ్చింది. ఈ పధకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమమని కాంగ్రెస్ అభివర్ణించింది.
ఈ పధకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఏటా రూ 72,000ను జమ చేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొంది. దేశానికి స్వాతంత్ర్యం సమకూరిన తొలినాళ్లలో 70 శాతంగా ఉన్న పేదరికం ఇప్పుడు 20 శాతానికి దిగివచ్చిందని, అలాంటి పేద కుటుంబాలకు ఈ పధకాన్ని వర్తింపచేసి దేశంలో పేదరిక నిర్మూలన చేపడతామని పేర్కొంది. దశలవారీగా ఈ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపింది.