‘పొగపెట్టడంలో వారికి వారే సాటి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ, షాలు అల్లర్లు రేపడంలో సిద్ధహస్తులని వీరిద్దరూ పొగపెట్టడంలో ఘనులని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ..అమిత్ షాల చరిత్ర ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని, వారు చిచ్చు పెట్టడంలో నిపుణులని చురకలు వేశారు. అమెరికా వీరిద్దరికీ వీసా ఎందుకు నిరాకరించిందో దేశమంతా తెలుసని ఎద్దేవా చేశారు. ఇక మంటలు చల్లార్చడంలో కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ ముందుంటారని చెప్పుకొచ్చారు.
మోదీ, అమిత్ షాలు పొగపెడితే తమ పార్టీ వాటిని చల్లార్చుతుందని అన్నారు. ఇక భారత్లో హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని రషీద్ ఆరోపించారు. మోదీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్లు కలిసి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రషీద్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలో పౌర చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మరణించిన వారికి అమరవీరుల హోదా కట్టబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు