బీమా కోసం స్వచ్ఛందంగానే సమాచారం
ఆధార్పై విచారణలో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీమా, మొబైల్ కంపెనీలకు పౌరులు తమ వ్యక్తిగత సమాచారాన్ని స్వచ్ఛందంగానే వెల్లడిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆధార్ చట్టబద్ధతపై ప్రారంభమైన విచారణ గురువారం కొనసాగింది. పౌరులు వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేయరాదన్న సంగతి గురువారం ప్రస్తావనకు వచ్చినప్పుడు అత్యున్నత ధర్మాసనంపై విష యాన్ని గుర్తుచేసింది. ఆధార్ విధానాన్ని సవాలుచేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదిస్తూ...పౌరులు వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేలా ప్రభుత్వం ఒత్తిడి చేయరాదని, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని అన్నారు. దీనికి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ స్పందిస్తూ..‘మీకు బీమా కావాంటే ప్రైవేట్ సంస్థ వద్దకే వెళ్లాలి.
మొబైల్ కనెక్షన్ కావాలన్నా ప్రైవేట్ కంపెనీలనే ఆశ్రయించి వాటికి మీ సమాచారం ఇవ్వాలి. దీనికోసం ప్రభుత్వం ఎన్నో మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. కానీ అదే ప్రభుత్వం మీ చిరునామా, ఇతర వివరాలు ఇవ్వమంటే మాత్రం జంకుతున్నారు’ అని పేర్కొంది. దివాన్ బదులిస్తూ.. జనాభా లెక్కల సందర్భంగా సేకరించే సమాచారానికి రక్షణ ఉన్నా ఆధార్ విషయంలో అలాంటి భద్రత కొరవడిందని పేర్కొన్నారు. ఆధార్కు నమోదుచేసుకునే సమయంలో వ్యక్తి కొన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తే రిజిస్ట్రేషన్ తిరస్కరణకు గురవుతోందన్నారు. డిజిటల్ యుగంలో పౌరులతో ప్రభుత్వం మిత్రుడిలా ఉంటూ, వారి గోప్యతా ప్రయోజనాలను పరిరక్షించాలన్నారు. వాదనలు అసంపూర్తిగా ముగియడంతో తదుపరి వి చారణ 23న పునఃప్రారంభమవుతుంది.