వాళ్లు వంట చేస్తే మా పిల్లలు తినరు..
దళిత అంగన్వాడీ కార్యకర్తలపై ఓ సామాజిక వర్గం వివక్ష
విచారణకు ఆదేశించిన తమిళనాడు మానవహక్కుల కమిషన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచం 21వ సెంచరీని దాటిపోతున్నా సమాజంలో దళితుల పట్ల వివక్ష ఇంకా వీడలేదు. ఇటీవల తమిళనాడులోని ఒక అంగన్వాడీ కేంద్రంలో దళితులు వండిన ఆహారాన్ని తమ పిల్లలు తినరని ఒక సామాజిక వర్గం ప్రకటించిన ఘటన గ్రామాల్లో నేటికీ కొనసాగుతున్న జాత్యాహంకారానికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్ గురువారం విచారణకు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వలయపట్టి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి దళిత సామాజిక వర్గానికి చెందిన జ్యోతిలక్ష్మి నిర్వాహకురాలిగా, అన్నలక్ష్మి వంటమనిషిగా ఈ నెల 3న నియమితులయ్యారు. ఈ నియామకాలను ఆ ప్రాంతంలోని మరో సామాజికవర్గానికి చెందిన వారు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.
వారిని పట్టించుకోకుండా అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారాన్ని వండిపెట్టి కేంద్రం వద్ద ప్రతిరోజూ ఎదురుచూడసాగారు. అయితే దళిత మహిళల నియామకం పట్ల అభ్యంతరం లేవనెత్తిన సామాజికవర్గానికి చెందిన వారు తమ పిల్లలను కేంద్రానికి పంపేందుకు నిరాకరించారు. గ్రామస్తులు అదేపనిగా ఆందోళనలు సాగించడంతో ధనలక్ష్మి, అన్నలక్ష్మిలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. కాగా, మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడంతో బదిలీ అయిన ఇద్దరు దళిత మహిళలను తిరిగి అదే అంగన్వాడీ కేంద్రంలో అధికారులు నియమించారు.
సంబంధిత వార్తలు